చదువు కథ -2(కథ )డా.బొంద్యాలు బాణోత్ (బంజారా)
మా గర్శలకుంట పొలంలో యాసింగి నారుమడి దున్నుతున్నాడు మా నాన్న. నేను మా నాన్నకి మద్యానం సద్ది తీసుకోని పొలంకాడకి పోయాను. మా పొలం గెట్టునానుకొని ‘కోరెం సంజీవరెడ్డి'(కాపోల్ల కోరెం సంజీవయ్య) పొలం ఉన్నది. ఆయన కూడా అదే రోజున నారుమడి దున్నుతున్నాడు. ఆయనకు కూడా వాళ్ళావిడ సద్ది తెచ్చింది. వాళ్ళు, మేము అన్నం తినడానికి మంచి నీళ్ళ కోసం, పక్కన్నే వున్న వాగులోని చెలిమె కాడికి చేరుకున్నాం.
సద్ది మూట ఇప్పుకుంటూ.. “ఔను! భీలుగా వీడు నీకొడుకార!?,” అని ఆశ్చర్యంగా అడిగిండు ‘కోరెం సిజీవరెడ్డి’. “అవును పటేల, వాడు నా కొడుకే !,” అన్నాడు మా నాన్న, గిన్నెలో అన్నం-కూర కలుపుకుంటూ. “మరెన్నడు కనపడక పాయేనేంమ్రా!?.”అని అడిగాడు ఆశ్చర్యంగా. “వాడు మొన్నటిదాకా బడికి పాయేవాడు పటేల! మూడో తరగతి వరకు చదువుకున్నాడు. అన్నిట్లో ఫస్టు వచ్చేవాడు.కాని నేనే, ఇకనుండి బడికి పోవద్దని, మాన్పించి..మా గొడ్ల కాడికి పంపుతున్నా.” అని అన్నాడు మా నాన్న, అన్నం ముద్ద చేతిలో పట్టుకొని. “అరే! ఎందుకు రా ? చదివే పిలగాన్ని చెడగొట్టి, బడి మాన్పించినవూ!.” “ఏం చెప్పమంటవు పటేల ఆదోపెద్దగాథ!, కడుపు చింపుకుంటే మనకాల్లమీదనే పడుతుంది, ఏ చంపమీద కొట్టినా మనకే తలుగు తుంది, ఐనోడే అన్యాయం చేస్తుంటే ఎవ్వరికి చెప్పుకున్నా అది వ్యర్థమే!.” ” మరి చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది..!?” అని ఎంతడిగిన చెప్పకపోయేసరికీ; “నేన్జేప్తా పటేల.. అని ముందుకొచ్చి…
నేనప్పుడు ఐదు -ఆరు సంవత్సరాల బాలున్ని. కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. తెలియని విషయాలు తెలుసుకోవడం కోసం, పెద్దవాళ్ళను ప్రశ్నలడిగి, విసికించేవాడిని. ఐతే, అది 1980 వ దశకంలో మొదటి సంవత్సరం. ఎండాలం పోయి, వర్షాకాలంలోకి అడుగు పెడుతున్న సమయమది. అంటే, జూన్ నెలలోకి అడుగు పెడుతున్నామన్నమాట. ఆ సమయంలో ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. ఘొరమైన వేడిగాలి వీస్తూన్నది.
తండాలో నాయకులు, యువకులు అందరు తండాలోని పెద్ద చింత చెట్టు కింది రాళ్ళమీద కూర్చోని మాట్లాడుకొంటూ.. తండా నాయకుడు మాట్లాడుతూ “వచ్చే సోమవారం రోజున మన తండాకు బడి పంతూలు వస్తూంన్నాడు. ఎన్నోరోజుల, మన తండాకు బడి మంజూర్గావాలనే కల నెరవేరింది. మన తండానుండి, మన పిల్లలు ఊళ్ళోబడికి పోతుంటే, ఊళ్ళోవాళ్ళు ,దారిలో భయపెట్టడంవలన, చాలా మంది చదువుకు దూరమయ్యారు.ఐతే ఇప్పుడు ఆ సమస్య వుండదు, కాని మన పిల్లల్నీ మనము ప్రతిరోజు బడికి పంపాలె, లేకపోతే మంజూరైన బడిని, అదే విదంగా బడి పంతుల్నీ రద్దు చేసేస్తారు. అప్పడు సమస్య మళ్ళీ మొదటికి వస్తూంది.” అని మీసమ్మెలేసుకుంటూ అన్నాడు తండా నాయకుడు. ఈ విషయం విన్నా నేను, వెంటనే ఉరుక్కోంటూ, ఇంటికి పోయి, మా అమ్మతో చెప్పి, వచ్చే సోమవారం నుండి మనతండా పిల్లలందరూ బడికి పోతారట, నేనుకూడా వచ్చే సోమవారం నుండి బడికి పోత, నన్ను కూడా బడిలో జయిన్ చెయ్యమని అడగగా, మా అమ్మ ఒప్పుకోని “ముందుగా బడిని, బడి పంతూలుని.. తండాకు రాని!, వస్తే అందరి కంటే ముందుగా నిన్నే జాయిన్ చేయిస్తాను.” అని ముద్దుగా చెప్పి, నా తలమీద చెయ్యేసి,తల నిమిరింది మా అమ్మ.
చూస్తుండగానే వారం రోజులు గడిచినయి. అనుకున్నట్టుగానే, సోమవారంనాడు బడి పంతులు రానేవచ్చిండు. కొత్తగా బడి పంతులు తండాకు రావడంతో, తండా వాసుల్లో ఆనందానికి హద్దులు లేవు. అందరూ, తమ తమ పిల్లలను బడిలో చేర్పిస్తున్నారు.
మా అమ్మ కూడా,నన్ను బడిలో చేర్పించేందుకు పోయి.. ముందుగా సారు ఊరు-పేరు తెలుసుకోవాలని..” నీ పేరేంటిది సారు!? మీదేవూరు!?, సారు.” అని వినయంతో కూడిన గౌరవంగా అడిగింది మా అమ్మ. ” అమ్మా!, నా పేరు ‘తిరుపతి రెడ్డి’, మాది ‘పస్రా’.” అని అంతే గౌరవంగా సమాధానమిచ్చాడు బడి పంతులు.
“ఇగో, ఈ పిలగాడు నా కొడుకు, బడిలో జయీన్ చేస్తామని వచ్చిన సారు, బడి మంచిగ చెప్పుసారు, లేకలేక దక్కిండు ఒక్క కొడుకే సారు, నీ దండంపెడత..” అని అన్నది మా అమ్మ ,రెండు చేతులతో నమస్కారం పెడుతూ. “సారు, తిరిగి నమస్కారం పెడుతూ, సరేనమ్మా!, మీ బాబు పేరేంటి?” అని సార్ అడగగా!,
“పేరు..’బొందాలు’ ” అని సమాధానం చెప్పగా ” “సరే, ఇంటి పేర్జేప్పు?” అని సారడగగా,” ఇంటి పేరు ‘బాణోత్’ ” అని చెప్పింది ,”పుట్టిన తేదీ మరియు సంవత్సరం చెప్పు” అని అడగ్గా,” సార్, నా కొడుకు నాల్గు సంవత్సరాల కిందట, వానాకాలం కల్లాలప్పుడు పుట్టిండు.” అని చెప్పింది, నేను జన్మించిన రోజును గుర్తుకు తెచ్చుకొంటూ. “ఆ విధంగా చెపితే నడవదమ్మా!, కచ్చితమైన పుట్టిన తేదీ మరియు సంవత్సరం, చెప్పాలె. మీ భర్తను పిలువు, ఆయన్నడుగుదం.” అని కచ్చితంగా చెపిండు సారు. అప్పుడు మా అమ్మ, మా నాన్నను
“ఏ..బొందా..బొందాలు వోయ్.. ఇదే..వర..వర..వర..తోన.. సార్.. బలారొచేయ్…” అని కూతేసి.. పిలిచింది, మా అమ్మ. ఆ కూత విని , మా ఇంటికి చుట్టమొచ్చిన మా మామను వెంటపెట్టుకొని, బడిపంతులు వద్దకు పోయి, కారణమడగ్గా,” మీ బాబుదీ పుట్టిన తేదీ మరియు సంవత్సరం, చెప్పితే రిజిస్టర్ లో పేరెక్కిస్తా..” అని అన్నాడు బడి పంతులు. ” మా కొడుకు నాల్గు సంవత్సరాల కిందట వానాకాలం కల్లాలప్పుడు పుట్టిండు, సార్” అని ఉత్సాహంగా సమాధానమిచిండు, మా నాన్న. ” అరే నాయకుడా అట్లా చెబితే! ఎట్లా రాసేదీ!? రిజిస్టర్ లో ” అని నారాజుగా అన్నాడు బడి పంతులు. ” ఇగో సారు, ఈన పేరు ‘ఠగ్యా’, మా బావ, మూడవ తరగతి వరకు చదువుకున్నాడు, ఆయనకన్నీ తెలుసు, ఆయన చెప్పుతడు, రాసుకొండి.” అని అన్నాడు ఒకంత ఉత్సాహంగా. “ఐతే, నువ్వు చెప్పు నాయకుడా.. పుట్టిన తేదీ మరియు సంవత్సరం, చెప్పు..” అని అన్నాడు తొందర పాటుగా. “రాసుకొండి సారు.. 25వ తారీఖున, 10వ నెల 1974వ సంవత్సరం లో పుట్టిండు, సార్ ” అని గుర్తుకు తెచ్చుకోని, చెప్పగా.. లో లోపల నువ్వుకుంటూ, నా వివరాలు రిజిస్టర్ లో రాసుకోని,” ఈ రోజుతో మీ బాబు బడిలో చేరినట్టు, రోజు బడికి రావాలి, పలకా- బలపం మేమే ఇస్తాం, రోజు మధ్యాహ్నం, ఉక్మా పెడతం, బాబును ఉండనిచ్చి, మీరు ఇంటికి పోవచ్చు” అని మృదువుగా చెప్పిండు సారు. ” బస్తాతట్టు ఇచ్చి ,మల్ల ఇప్పుడే తోల్తా సారు, కింద అంతా గొడ్ల పెండరొచ్చు ఉన్నది, ఎట్ల గూసుంటడు!?” ” సరే మంచిదమ్మా!”
* * *
కొత్తగా బడి మంజూరు కావడంతో, బడి పంతులు తప్పా, మరే సౌకర్యం లేదు. పంతులు కూర్చోవడానికి కుర్చీ కూడా లేదు. ఆయన కూర్చోవడానికి నులక మంచం మీద చద్దరేసిండ్రు. తండా నాయుడు మా పెదనాన్న కావడంతో, బడిని మా పెదనాన్న పశువుల కొట్టంలో నడుపుతున్నారు. ఆ పశువుల కొట్టాన్ని అప్పుడప్పుడే కొత్తగ, మా భూమిని ఆక్రమించి, అందులో కట్టిండు మా పెదనాన్న. వర్షాకాలం కావడంతో, పశువులను ఇడిసిన తర్వాత, పెండతీసి, ఉడిసి, శుభ్రం చేసిన తర్వాత, బడి పిల్లలను కూర్చో బెట్టేవారు. ఐనా, వర్షాకాలం కావడంతో, ఆ కొట్టంలోపల తడారేదికాదు, పైగా పశువుల రొచ్చు వాసన వచ్చేది. ఐనా, అప్పటి వరకు బడి, చదువు అంటే,తండా వాసులకు అందని ద్రాక్ష లాంటిది కావడంతో, ‘బడికి పోతున్నాం, చదువు నేర్చకొంటున్నాం’, అనే సంతోషం ముందు, ఆ సమస్యలు, పెద్దగా అనిపించేవికావు.
ఐతే,సార్ నాకు పలకా-బలపమిచ్చాడు. రోజు రొటీన్గా బడి నడుస్తూన్నది. 5 సంవత్సరాల చిన్న పిల్లలనుండి 14 సంవత్సరాల పడుసు వయస్కులవరకు, అందరూ కలిసి ఒకే తరగతిలో కూర్చోని చదువుకొనే వారము. నేను, చకచకా.. అచ్చులు,హల్లులు, గుణింతాలు, ఒకట్రెండ్లు వంద వరకు… అందరి కంటే ముందుగా అప్పచెప్పేవాణ్ణి . అంతమంది పెద్ద పెద్దల ముందు, ‘సార్’ నన్ను మెచ్చుకోవడంతో, ఇంకా బాగా చదవాలనిపించేది.
అప్పటికీ బడి మొదలై మూడు నెలలు కావస్తోంది. ఈ మూడు నెలల్లో, నేను అచ్చులు, హల్లులు, గుణింతాలు, ఒకట్రెండ్లు వంద వరకు నేర్చుకున్నాను. 15 ఆగష్టు రావడంతో , మా సారు బడి పిల్లలందరికీ ఆటల-పోటీలు, పాటల-పోటీలు నిర్వహించాడు. వాటిల్లో, నా సమాన వయస్కుల్లో, నాకే మొదటి బహుమతి వచ్చింది. మొదటి బహుమతి పెన్ను , రెండవ బహుమతి పెన్సిల్, మూడవ బహుమతి కట్టె బల్పం ఇచ్చాడూ. 9 నుండి14 సంవత్సరాల వయస్సు గల వారిలో లక్పతి, గోవిందు.. బాగా చదివే వారు.
బహుమతుల పంపకం తర్వాత మా సార్ 15 ఆగష్టు రోజు యెక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ, చివరకు ఈ మూడు నెలల్లో పిల్లల ప్రగతి గురించి మాట్లాడుతూ ” మన ‘బొంద్యాలు’, సంవత్సర కాలంలో పూర్తిగా నేర్చుకునే చదువును కేవలం మూడే మూడు నెలల్లో నేర్చుకోగలిగాడు.. అతను అలాగే బాగా చదువుకొని, వాళ్ళ తల్లి-తండ్రులకు, ఈ తండాకు, అదేవిదంగా మన బడికి.. మంచి పేరు ప్రతిష్టలు తేవాలని.. ఆశిస్తూ ముగిస్తున్నాను.” అని తన ఉపన్యాసం ముగించాడు మా సార్.
ఐతే,అప్పటి నుండి నాలో ఇంకా చదవాలనే ఉత్సాహం రెట్టింపయింది. తండా వాసులందరు, చిన్నా-పెద్దా, ఆడా-మగా, చావడికాడా, చింత చెట్టు కింద, పనులకాడా.. నా గురించే మాట్లాడుకొంటున్నారు. నాకు మంచి పేరు రావడం, మా పాలి వాళ్ళకు తప్పా, మిగతా తండా వాసులందరు ప్రశంసిస్తూన్నారు.
* * *
మేము చదువుతున్న బడి(పశువుల కొట్టం), తండా నాయుడు, మా పెదనాన్న, ఎంత చెప్పినా వినకుండా,మా స్థలం ఆక్రమించి, అక్రమంగా కట్టడంతో, ఇక ఎంత చెప్పినా వినడని భావించిన, మా అమ్మా , తండాకొచ్చిన ‘రావు నరసింహ్మా రెడ్డి’ కి చెప్పగా “ఏంచేస్తం!? సీత.., కలికాలం, నేన్జెప్పినంత మాత్రాన, వాడింటాడా!?, పెదచాపా చినచాపల్ని మింగేసిన చందంగా వుంది, ఇది. మహాభారతంలో పాండవులు కూడా ఇదే విధంగా ఇబ్బందులు పడ్డారు, కానీ చివరకు పాండవులే విజయం పొందారు” అంటూ తన ధోతి కొస చేతిలో పట్టుకొని, హైండిల్ మీద చెయ్యేసి, సైకిల్ తొక్కుకొంటూ వెళ్లిపోయాడు.
ఐతే,”ఆ నాయకుడికి మంచి-చెడు చెప్పీ, తన స్థలం తిరిగి ఇప్పిస్తాడేమే ననుకొంటే, ఏదేదో చెప్పిండు, ఒక్క ముక్కర్దంగాలేదు. ఇక ఈయనతో కాదని భావించి,” మా ఊరి సర్పంచ్ ‘బిళ్ళా సంజీవరెడ్డి’కి ఫిర్యాదుచెయ్యగా, వెంటనే ఎల్ల మస్కూర్ ను పంపి, మా పెదనాన్నను పిలిపించుకోని, గట్టిగా మందలించడంతో, ఆ విషయాన్ని , తన మనుసులో పెట్టుకొని, సమయం కోసం ఎదురు చూస్తూన్నాడు, మా తండా నాయకుడు.
చదువులో తన తోటి వాళ్ళకంటే ముందు, ఆట-పాల్లోకూడా ముందుండటంవల్ల, మా సారు మెచ్చుకోవడం, అది చూసి తండా వాసులందరు ప్రశంసించడం, నాలో ఇంకా మంచిగా చదవాలనే, ఇంకా బాగా ఆడాలనే, కుతుహలం పెరిగింది.
ఇంతలో వర్షాకాలం పోయింది. నవంబర్ నెల తర్వాత నుండి వర్షాలు తగ్గినయి. పశువుల కొట్టంలో ఉన్న బడిని ఇంటెనక పెరడులో, చెట్లు, చెత్తా-చెదారమంతా సాఫ్ చేపించి, అందులో గురిసేపించి, ఆ గుర్సెలో బడి నడిపించేవాడు మా సారు. ఆ బడి గుర్సెముందు మట్టితో గద్దె కట్టి, ఆ గద్దెలో ఒక చక్కటి, ఎదడుబొంగులాంటి కర్రకు గోదుమపిండి వుడికించి, చల్లారిన తర్వాత, దాన్ని ఆ కర్రకు పూసి, రంగు-రంగుల కాగితాలంటించి, జెండా ఎగిరించే దానికి అనువుగా చేసి, దాన్ని ఆ గద్దెలో నాటించి, దాని మీద 26 జనవరిన జెండా ఎగురవేశారు మా సారు.
ఈ సందర్భంగా, ఆయన మాట్లాడుతూ ” ఈ రోజున మనమందరం కలిసి ’26 జనవరి’ జరుపు కొంటున్నాము. అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు, అంటే ఈ రోజునుండి మనలను మనమే పరిపాలించు కొవడమని అర్థం. ఐతే, ఈ తండా బడిలో నేను మొదటి పంతులుగా వచ్చాను, నాకు చాలా సంతోషంగా వుంది, నేను ఇక్కడి నుండి తబాదలై ఎల్లి పోయిన, నా జీవితంలో మరువలేను, మీరందరు కూడా నన్ను గుర్తుంచు కుంటారని.. భావిస్తూ.. ముగిస్తున్నాను, జై హింద్.” అంటూ ఆర్ద్రత తో కూడిన తన ప్రసంగాన్ని ముగించారు.
అతను అన్నట్లే, ఆ సంవత్సరం చివరి వరకు వచ్చాడు, ఎండాకాలం సెలవుల్లో పోయిన మా సారు మల్లి రాలేదు. ఆయన స్థానంలో వేరే సారొచ్చారు. ఈ సారు పేరు ‘కొమరయ్య’ సారు. ఈయనది వర్దన్నపేట. రోజు వర్దన్నపేట నుండి వచ్చే వాడు. ఆయన రాకతో బడి స్థలం కూడా మారింది. ఇప్పుడు ఆ బడి ‘గుగులోత్ దామా’ ఇంటి గోడకు ఆధారంగా పాకా/ వసార /గుర్సె కట్టి, ఇందులో బడి చెప్పడం మొదలు పెట్టారు. అప్పుడు నేను రెండవతరగతి లో చదువు తున్నాను. నాకు బడన్నా, ఆ బడి ఆవరణ స్థలమన్నా నాకు చాలా ఇష్టం. నేను పొద్దున్నే బడికి పోతే, అక్కడే ఉండేవాడిని, ఆకలేసినపుడు మాత్రమే ఇంటికి పోయి ఇంత అన్నం తిని వచ్చేవాడిని, ఆ బడి ఆవరణ స్థలాన్ని శుబ్రం చేసేవాడిని, అందులో పూల చెట్లు పెట్టే వాడిని, ఆ చెట్లకు రక్షణగా కంచెనాటేవాడిని, అవ్వీ ఎండిపోకుండా, వాటికి బోరింగ్ నుండి బకిట్లో నీళ్ళు తెచ్చి పోసే వాడిని. ‘కొమురయ్య’ సారు కూడా నన్ను, నా చదువును మెచ్చుకొనే వాడు, ఆయన అరటిపండ్లు తెచ్చుకుంటే, అందులో నుండి ఒకటో-రెండో నాకిచ్చేవాడు. మిగతా పిల్లలకు చాక్లెట్లు,బిస్కేట్లు ఇచ్చేవాడు.
నేనిప్పుడు మూడవ తరగతిలోకి ప్రవేశించాను. తండాలో పెద్ద వాళ్ళు,సారు కులం గురించి మాట్లాడుతుంటే విని..ఒక రోజు అనుకోకుండా బడిలోనే ‘సారు’ కులమడిగాను. ఐతే, సారుకు అది నచ్చక, దండనగా ఇరవై (20) బిస్కీళ్ళు తీపించడంవలన, నేను ఆ తర్వాత రోజు బడికి పోలేదు, కాని బడి చుట్టూ పక్కల అక్కడక్కడే ,తిరిగే వాడిని, అది గమనించిన మా సార్, ఒక విద్యార్థిని నా దగ్గరకు పంపించి, నన్ను తన దగ్గరికి, రపించుకొని, బడికి రాకపోవడానికి కారణం తెలుసుకొని రేపటి నుండి బడికి రావాలని ఆదేశించాడు. మరునాడు నుండి మళ్ళీ ఎదావిధిగా బడికి పోయాను. ” ఈ చిన్న పనిష్మేంట్ కే, బాగా చదివే నువ్వే బడి మానేస్తే ఎట్లా బాబు, ఇంకెప్పుడు అలా చెయ్యకు” అని నా బుజంపై చెయ్యి వేసి, బుద్గరించి, బుగ్గలు పిండి చెప్పాడు.
క్లాస్ చెప్పడం మొదలు పెట్టీ, “క్లాస్ వర్క్ కాపీలు తీసి, ఇప్పుడు నేను బోర్డు మీద రాసే ప్రశ్నలు, జవాబులు తప్పులు లేకుండా రాసుకోవాలి” అని చెప్పీ, చాక్ పీస్ తో బోర్డు మీద రాసాడు కానీ బోర్డు సరిగ్గా పని చేయడం లేదు. అప్పుడు ఆయన ” మనకు ఒక కొత్త బోర్డు(నల్లబల్ల) మంజూరైంది. దాన్ని తెచ్చేవాళ్ళులేక, అది మనూరి పెద్ద బడిలోనే పడుంది. దాన్ని తెచ్చుకుంటే, అది మంచిగా పనిచేస్తుంది.” అన్నాడు మా సార్.
అప్పుడే లేసి ” నేన్దేస్తా సార్ ” అన్నాను ఆసక్తిగా. “అదీ బరువు ఉంటది, నువ్వు మోయగలవా!?” అని అన్నాడు సార్. ” నేను ఎత్తుకొస్తా సార్” అని ఇష్టంగా అన్నాను. “సరే! చూద్దాం లే!” అని చూసాయగా అన్నాడు సార్. కాని ఎట్లైన చేసి ఆ బోర్డును నేనే తేవాలనుకోని, మరుసటి రోజు బడికి పోకుండా, సక్కగా మా ఊరి బడికి పోయి, మా సార్ పేరు చెప్పి, బోర్డును నెత్తి మీద ఎత్తుకొని, తండా బడికి బయలు దేరి వస్తూండగా, అది చాలా బరువుగా ఉండటంతో, బాటసారుల సహాయంతో, ఆరు సార్లు దించి, మళ్ళీ ఎత్తుకొని.. చివరకు తండా బడిలోకి పోయి, మా సార్ సహాయంతో కిందికి దించాను. అది చూసి మా సార్ నివ్వెర పోయాడు. ” పట్టుదల ఉంటే కానిది లేదు, ఏ పనైనా ఇష్టపడి చేస్తే కష్టమనిపించదు” అన్నాడు ఆనందంగా.
ఐతే, సంక్రాంతి సెలవులు రావడంతో, వారంరోజులు ‘సారు’ రాలేదు. ఇక బడికి సెలవులని, నేను కూడా అటువైపు పోకపోవడంతో, ఆ బడిగుర్సె ఆవరణమంతా చెత్తా-చదారమైయింది. పూల చెట్లు సగమెండిపోయినయి. ఐతే, రేపటినుండి బడి నడుస్తదనగా, ముందురోజు సాయంత్రం పూటా పోయి చూస్తే, పరిస్థితి పైవిదంగా ఉండడంతో, నేను, నా మితృడు కలిసి స్కూల్ ఆవరణమంతా క్లీన్ చేసి, పూల-చెట్లకు నీళ్ళు పోస్తూండగా..పొద్దుబూకాల్లకు, కూతవేటు దూరంనుండి, ముగ్గురు మనుసులు, రెండు మేకలు-ఒక గొర్రె పిల్లను తోలుకోని, చాలా దూరం.. వరుకు వినబడే విధంగా, పెద్ద- పెద్దగా అరుచుకుంటూ, మాట్లాడుకుంటూ, నావైపు/తండా వైపుకు వస్తూండగా, అందులో నుండి ఒక మేక మరక తప్పించుకొని, అరుచుకుంటూ, లింగ్డేర్ డొంకవైపు ఉరుకుతుంటే..
దాన్ని మర్రేసి పట్టుకొచేవాళ్ళు లేకపోవడంతో, మమ్ముల ఆమేకను మర్రేసుకోరమ్మని కూతవేశాడు మా పెదనాన్న. కాని మేము పూలచెట్లకు నీళ్ళు పోయడంలో నిమగ్నమై వుండటంవలన, ఆ మేకనూ మర్రేసి పట్టుకొరాలేదు. అందుకు ఆగ్రహించిన మా తండా నాయకుడు, మా పెదనాన్న కోపంతో రగిలిపోతూ.. ” వీడికీ ఎంత బలుపు!?,నా మాటే వినడా!?, పూలచెట్లు నా కంటేయెక్కువైనాయా!?, నువ్వు నా చేతికి దొరకాలె! నీ సంగతి చెప్తా!..” , అంటూ నన్ను పట్టుకోని కొట్టే ప్రయత్నం చెయ్యగా, నేను దొరక కుండా ఉరికి ఉరికి.. మా ఇంటిముందు డొంకలో దాక్కున్న. అదే కోపంతో మా ఇంటికొచ్చి, “నీకొడుకెక్కడ!?, వాడు రేపటి నుండి బడిలో కనబడితే..! వాని సంగతి చెప్తా, వానికి నాకంటే, నా మాట కంటే, బడి, బడిలో పూలచెట్లు ఎక్కువైనయ!?, వాడెక్కడా!? బయటికి రమ్మను..” అంటూ అగ్గిమీద గుగ్గిలమయిండూ మా పెదనాన్న.
ఈ పరిస్థితిని చూసి, మా అమ్మా- నాన్నలకి భయం పట్టుకుంది. ఎందకంటే!?, ఆయనకి మంత్ర -తంత్రాలు, చేతబడి..వస్తదని తండా ప్రజల నమ్మకం. ఆ భయం వలన తండాలో అతన్ని ఎదిరించడానికి ఎవ్వరు ముందుకు వచ్చేవారు కాదు. మా ఇద్దరు చిన్నాన్నలు ఆయన మంత్రాలు-చేతబడి చేయడం వల్లనే చనిపోయారని, మా అమ్మా-నాన్నలు నమ్మేవారు. ఇప్పుడు నన్నుకూడా అలాగే చంపేస్తాడేమోనని భయం పట్టుకుంది మా అమ్మా-నాన్నలకి. అందుకనే “ఆ బడి, చదువు..లేకుంటే లేకపాయ్ కాని నా కొడుకు బతికితే నాకదే చాలు” అని ఒక గట్టినిర్ణయానకి వచ్చాడు మా నాన్న. ఐతే,ఆ మరుసటి రోజున బడికి పోదామనుకుంటే, గోడ కొయ్యకు తలిగించిన పుస్తకాల సంచ్చి లేదు. ఇంట్లో అటూ-ఇటూ వెతకగా, గాబుసందులో ఖాలి సంచ్చి, కంపాస్ దొరికినయి. పుస్తకాలేమైనయని! వెతుకుతుంటే, కొట్టంలో పొయికాడ, సగానికెక్కువ కాలిన కాగిదపు ముక్కలు కనిపించడంతో, మనుసులో దుఖమాగకా ఎక్కెక్కిఏడ్చానూ. మా నాన్న నడుగుతే, ” చదువొద్దు, బడొద్దు ఏదొద్దు.. ఇప్పటికే నిన్ను బతికించుకోవడానికి, ఎన్నోకష్ఠాలు పడ్డాను. ఇప్పుడు ఎవరికంట్లోపడొద్దు! ఏదో కష్ఠంచేసుకోని బతుకుదాం. నువ్వు ఈరోజునుండి మన గొడ్లను(పశువులను) మేపుకోర.” అని దుక్కభరితంగా, కంటనీళ్ళు పెట్టుకుంటూ..అన్నాడు మా నాన్న. అని జరిగిందంతా పూసగుచ్చినట్లు.. చెప్పిండు.
ఇదే అదునుగా భావించిన ‘కోరెం సంజీవరెడ్డి’ , ఆ బాలున్ని తమ వద్ద జీతం/పాలేరు గా పెట్టుకోవాలనుకొని…
“వాన్ని నాదగ్గర పనికుంచ్చురా!, మన పశువుల మర్రెసేటన్దుకు ఎవర్లెరు!. అంతో-ఇంతో జీతమిస్తే నీకాసరైతడు అదేవిధంగా పన్నే ర్చుకుంటడు, దకా..!?. వానికి అన్నీ పనులు నేన్నెర్పిస్తాన్లే.” అని అన్నాడు అన్నం చేతి వేళ్ళు నాకుతూ..” “వాడు ఎనమిదేంళ్ళ చిన్నపిలగాడు, పటేల. గన్ని గొడ్లను మర్రేస్తాడా!?, వానికాగుతాయా!?. అని అన్నాడు తిన్న అన్నాం గిన్నె కడుగుతూ. “అరే! మేంమ్లేమానయ!?, వాడికి చేతగాని పనిచెప్తామా..! ఏంటీ..!? వాడేపనీ చెయ్యనక్కరలేదు. కాస్త ఆ గొడ్లను మర్రేస్తే చాలు.” అని ఒప్పించడానికి ప్రయత్నం చేశాడు ‘కోరెం సింజీవ రెడ్డి’. ” ఐతే, జీతంతోపాటూ ఓ వెయ్యి రూపాలు, రెండు పైసల మిత్తికి కావాలె మరి, ఇస్తానంటే!, మరి నువ్వన్నటే జీతముంచుత.” అని అన్నాడు చెలిమెకాడి నుండి లేసి, నారు మడి వైపుకు పోతు.
“అరే! నాయకుడా! ‘నలుగురితో నారాయణా’, మనము వేరే కాదు కదా.. !?” అని అన్నాడు ‘కోరెం సంజీవ రెడ్డి,’ ఆశగా..
డా.బొంద్యాలు బాణోత్ (బంజారా)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
చదువు కథ -2(కథ )డా.బొంద్యాలు బాణోత్ (బంజారా) — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>