డా.తరపట్ల కవితల ‘యజ్ఞం’ (పుస్తక సమీక్ష )- డా.ఆర్. శ్రీనివాసరావు,
యజ్ఞం పేరు వినపడగానే మన హృదయంలో వెంటనే స్ఫురించేవి కారా మాష్టరు రాసిన యజ్ఞం కథ. ఆ పేరు తెలుగు సాహిత్యంలో కొంతకాలం ఒక సంచలనాన్నికలిగించింది. యజ్ఞం కథ తెలుగు కథా సాహిత్యానికి ఎనలేని గుర్తింపును తీసుకు వచ్చింది. మరల ఈ నాటికి ‘యజ్ఞం’ పేరుతో డా. తరపట్ల సత్యనారాయణగారు కవితల్ని ఒక సంపుటంగా తీసుకువచ్చారు.
డా.తరపట్ల పరిచయమే అక్కరలేని సాహితీవేత్త, అదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలోని తెలుగు ఆచార్యులు, పరిశోధకునిగా, పర్యవేక్షకునిగా, అనేక సదస్సుల నిర్వాహకునిగా, జానపద కళాభిమానిగా,విమర్శకునిగా, సంకలనకర్తగా మనందరికి పరిచితమైన సుపరిచితుడు. కలంపేరు నగ్నజ్వాల. విద్యార్థులు టి.యస్.ఎన్.గా పిలుచుకుంటారు. డా.తరపట్లలో మనకు తెలియని కోణం వచన కవితల రచయితగా అనేక కవితలు రాయటం. కొందరికి మాత్రమే తెలిసిన కవిగా డా.తరపట్ల ‘తన కవితలు అన్నీ౦టినీ కలిపి ఒక సంపుటిగా ముద్రించారు. దానికి ‘యజ్ఞం’ వచన కవిత్వం పేరుతో ప్రచురించటం విశేషం.
యజ్ఞం కవితల సంపుటిలో మొదటి కవిత ‘నా అక్షరాలు’
‘నా అక్షరాలు అప్సరసలు కావు
నైజంలో నిజాన్ని నగ్నంగా
నిర్వఘ్నంగా చాటి చెప్పే
నగ్నజ్వాలలు నా అక్షరాలు
గురులఘువులు వడిలో
యతిప్రాసల సుడిలో
గణాలంకారాల కౌగిళ్ళలో
చిక్కుకున్న పక్షులు కాదు
నా అక్షరాలు………………అంటూ తన కవిత్వపు అడుగులను ఆరంభించారు.
ఈ పై కవిత చదివిన వెంటనే తిలక్ రాసిన ‘అమృతం కురిసిన రాత్రి’ కవితలు గుర్తుకు వస్తాయి.
నా అక్షరాలు వెన్నేల్లో ఆడుకునే అంధమైన ఆడపిల్లలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయతోరణాలు అందమైన ఆడపిల్లలు….. ” అన్నారు.
నేడు దేశంలో, రాష్ట్రంలో పేదరికం,సాంఘిక, ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం వంటి సమస్యలతోపాటు మహిళల పడే బాధలను, వరకట్న వేధింపులను, బ్రూణ హత్యలు,పరువు హత్యలు, గృహహింసలకు చెందిన సమస్యలను చూసి చలించి ఆవేదనతో రాసిన కవిత ‘ఆవేదన’
నేనేం పాపం చేసానని?
నేనేం నేరం చేసానని?……..ప్రశ్నిస్తూనే
కొన్ని మాసాలు పాటు
చీకట్లో ముద్దుగా పెంచి…….
నేను ఆడపిల్లనని తెలిసే కదా..
ఈ చీకటి గర్భంలోనే
నన్నoతం చేయటానికి పంతం పట్టారు.
ఇంకా వరకట్న వేధింపులను బలై పోతున్న స్త్రీల కోసం ‘కళ్ళు తెరవండి’ కవితలో
కట్నాల కుంపటి సెగలు
కిరోసిన్, గ్యాస్ స్టావ్ లు
యాసిడ్ బాటిళ్లు
అగ్గిపుల్లలే నీకు కట్టెలై
నిలబడి ఎదురు చూస్తూన్నాయి’ అంటారు డా.తరపట్ల.
భారతదేశం జనాభా పెరుగుదలలో ప్రపంచంలో మొదటి స్థానాన్ని సంపాదించుకోబోతుంది.ఈ సమయంలో జనాభా నియంత్రణ జరగాలని ‘ఆపరేషన్ చేయించుకోభారతి’ అని సూచిస్తూ
అమ్మా ఓ భారతి
కనినంతమాత్రాన సరిపోతుందా భారతి
సంపాదన లేని సంసారం నీది
ఉపాధిచూపలేని అపరాధివి నీవు’
ఇప్పటికైనా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవమ్మ
అదైనా ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం వద్దు సుమా
ప్రైవేటు ఆసుపత్రిలో చేయించుకో
ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది కదా… అని వ్యంగ్యాస్త్రాన్ని సంధిస్తారు.దేశ ప్రస్తుత పరిస్థితులను బట్టి జరుగుతున్న అనేక సంఘటనలను బట్టి కవితా రచనను చేశారు డా. తరపట్ల.
నూతన ఉగాదిని ఆహ్వానిస్తూ ‘ఊగాదికాంత’‘గొంతెత్తకే కోకిల’ కవితలలో
ఉగాది గీతం ఎలా వినగలం కోకిల
నీవు గొంతెత్తి మా హృదయాల్లో
అగ్ని వర్షం కురిపించకు’
ఇంకా నాదేశం, భరతమాతకు మానభంగం, భరతమాత,స్వరాజ్యం, మేము భారతీయులం, అనే కవితలు దేశభక్తిని ప్రబోధిస్తున్నాయి. ‘ఆహా ఆంధ్రభోజ’ ఓ జాషువా నేవు మళ్ళీ పుట్టాలి, శ్రీశ్రీ నేవు కవిగా మళ్ళీ పుట్టకు’ అంటూ పూర్వ కవి స్తుతి చేశారు.
డా.తరపట్ల మీద ఆధునిక కవుల ప్రభావం ఎక్కువగానే కనిపిస్తుంది. సత్యనారాయణగారి మీద ఒక్కోసారి ఒక్కో కవి పూనినట్లుoది. ఒకచోట కృష్ణశాస్త్రి, మరోచోట శ్రీశ్రీ, ఇంకోచోట తిలక్, మరికొన్నిచోట్ల జాషువాలా ఉంది. కవిత్వం అంటే అనుసృజనేకానీ, అనుకరణ కాదు. ఒక కవిత పాఠకుని మనసులో ముద్ర వేయాలంటే కవి ఎన్నో రకాలుగా కష్టపడాలి. మంచి శిల్పం ఉండాలి. పదాల నడకలో లయ ఉండాలి. గాఢమైన భావ సాంద్రత ఉన్న కవిత మాత్రమే మనసుని కదిలించగలదు. సందర్భం వచ్చినప్పుడల్లా అప్రయత్నంగా గుర్తుకు రావాలి. అందువలనే నెటికీ గురజాడ, శ్రీశ్రీ, తిలక్ ల కవిత్వాన్ని చదువుతూనే ఉన్నాం. తరాలు మారినా వారి కవిత్వం తాజాగానే ఉందటుంది.
డా.తరపట్ల తన కవిత్వంలో సరళమైన పదాలు, పదునైన పదబంధాలు,వ్యంగ్య ధోరణి ప్రముఖంగా కనిపిస్తుంది. అంత్యాను ప్రాసాలంకారాలు వాడారు, అంతేకాకుండా ‘వొంటరి కోకిల’ కవితలో ధీర్ఘ సమాసాలు వాడారు. ‘వృషభఖరవృషణ కణజనితవీరులు
బహశిశ్న సంయోగ విషముష్కరులను………
ఆ నీలి బాంధవుని….
డా.తరపట్ల వాస్తవిక కవి. తన జీవితానుభవంలో లోకాన్ని అణువణువునా పరిశీలించిన వ్యక్తి. నిజాన్ని నిర్భయంగా చాటిన కవి. రచన శైలీలోను, శీర్షికలు పెట్టడంలోనూ, విలక్షణ శైలిని నిర్మించుకున్న కవి. ‘ఆయ్ మేము గోదారోళ్ళ మండీ మాకు కొంచెం చమత్కారం ఎక్కువండి’ అనే నానుడిని అనుసరించి గోదారోళ్ళ వెటకారం, చమత్కారం రెండింటినీ తన మాటల్లోనే కాదు కవిత్వంలో కూడా చిత్రించిన అచ్చమైన గోదావరి కవి. గొప్ప భావకుడు. సామాజిక చైతన్యాన్ని సామాన్యులలో కలిగించడానికి అక్షర సైనికుల్ని సృష్టిస్తూ నిరంతరం ‘యజ్ఞం’ చేస్తున్న కవి డా.తరపట్ల సత్యనారాయణ. ఈ మధ్యకాలంలో వెలువడిన ఉత్తమ కవితా సంపుటాలలో “యజ్ఞం కవితల సంపుటం” అగ్రగణ్యం అని చెప్పవచ్చు.
– డా.ఆర్. శ్రీనివాసరావు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
డా.తరపట్ల కవితల ‘యజ్ఞం’ (పుస్తక సమీక్ష )- డా.ఆర్. శ్రీనివాసరావు, — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>