నా కథ-4 – రాత్రి బడి — డా.బోంద్యాలు బానోత్(భరత్)
ఐతే, నేను రోజు నెత్తిమీద సద్దుల గంప్పా ఎత్తుకోని, 20-30 పశువులను తోలుకోని పోయి, సద్దులు చింతచెట్టుకింది, దొడ్డి దగ్గిర ఇచ్చేసీ, పొద్దంతా చెరువెనుక పశువులను మెపుకోని, సాయంత్రం అయ్యాకా,ఇంటికి తోలుకోని వచ్చే వాణ్ణి. ఐతే, నేను పశువులను తోలుకోని పోయే దారిలో , బుర్ర యాదగిరి ఇంటి పక్కన, ‘కోమటి బొర్రయ్య’ ఇంటి ప్రహారీ గోడకూ ఎదురుగా ఒక ఇంట్లో, ‘ఐదవతరగతి’ వరకు ఒక ప్రైవేటు స్కూల్ నడిచేది. ఐతే, రోజు నేను పశువులను తోలుకోని, ఆ స్కూల్ ను దాటుకుని పోయే క్రమంలో, ఆ స్కూల్ వద్దకు రాగానే పిల్లలందరూ, తెల్ల అంగీ, పచ్చ రంగు నెక్కరు, బెల్టు, షూ, ఎంచక్కా టక్కూ వేసుకోని, క్రమశిక్షణతో, లైనులో నిలబడి.. ‘జనగన మన…నాయక జయహే..’ అని ‘జాతీయ గీతం’ పాడుతుండేవారు. ఆ దృశ్యం చూసి-వినీ, నా మనసు వాళ్ళను చూడాలనిపించేది. కాని వాళ్ళు పెద్ద పటాకుల గలమను, పటాకులు మూసేసీ, ‘జాతీయ గీతం’ ఆలాపించేవాళ్ళు. ఐతే, నేను పశువులను వదిలేసి, నెత్తిన సద్దుల గంప్పా ఎత్తుకోని.. ఆ పటాకుల సంధు నుండి ప్రత్యేకంగా చూసీ, వినేవాడిని. ఆ ‘జాతియ గీతం’ అయిపోగానే, పరుగో పరుగుమనీ, ఉరికి ‘బొంగుమూతి ప్రతాపరెడ్డి’ ఇంటి వద్ద పశువులను అందుకునే వాడిని. ఆ విధంగా ప్రతి రోజూ చేసేవాణ్ణి.
ఐతే కొన్ని రోజులుగా, ఆ స్కూల్ మెడం, సార్ నన్ను గమనించీ..ఒక రోజు నన్ను అడిగారు. “ఏంటి..!? బాబు, రోజు, నెత్తిమీద అంత బరువెత్తుకోని, నిలబడి చూస్తుంటావు.. ఎందుకు? నీకేం కావాలి!?” అని అడిగాడు ‘రమేష్’ సార్. వాళ్ళ భార్య ‘వరలక్ష్మీ ‘ వెనకాల నిలబడి ఉంది. “ఐతే, ఏమి లేదు సార్, మీ స్కూల్ పిల్లలను చూసినప్పుడు, ఎనిమిది సంవత్సరాల క్రితం నేను కూడా ఇలాగే బడికి పోయే వాడిని. నాకు ఆ చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చీ, చూస్తూంటాను, నేను కూడా బడి మానకుండా, జీతముండ కుండా, బడికి పోయి వుంటే బాగుండేది” అని అనిపించింది, సార్. అనీ చెప్పగా, ” నీ పేరేంటిది బాబు? ” అని అడిగాడు ఆ సార్ . “నా పేరు ‘బొంద్యాలు'(రాములు)” అని చెప్పాను. ” చూడు ‘రాములు’ నీకు చదువుకోవాలని ఉంది, కాబట్టి, నీకు వీలైతే రాత్రి పూట బడికి రావచ్చు. ” అని అన్నాడు ఆ సార్. “నెలకు ఫీజు ఎంత ఇవ్వాలి? సార్!” అని అడుగగా. “రోజు వచ్చేవాళ్ళు నెలకు 50-100 రూ.వరకు వారి వారి క్లాస్ ను పట్టీ ఫీజు ఉంటుంది. నూవైతే ముందుగా బడికి రావచ్చు, ఫీజు విషయం తర్వాత చెబుతా, మహా అంటే నెలకు ఒక ఇరవై (20) రూపాయలు, ఇస్తే ,ఇద్దువుగాని, వీలైతే రేపటి నుండి రాత్రి 7:30 నుండి 8:00గం. వరకు . లేకుంటే 8:00గం. నుండి 8:30.వరకు ట్యూషన్ నడుస్తుంది. ఈ రెండు సమయాల్లో నీకు వీలును పట్టీ రావచ్చు.” అని ప్రోత్సాహం ఇచ్చాడు ‘రమేష్’ సార్.
రాత్రి పూట బడికి, సారైతే ఒప్పు కున్నాడు. కాని మా పటేల్ను ఎలా ఒప్పించాలి!? అనే ప్రశ్న నా మనసులో మెదులుతుంది. ఒక వేళ,నేరుగా ‘నేను రాత్రి పూట బడికి పోదామనుకుంటున్నా’ అని అడిగినా !? , ‘పొమ్మనీ’ అనుమతి ఇచ్చే వాళ్ళు కాదు. అందుకనే అనుమతి అడగకుండానే, రోజుకు బిన్నంగా, ఆ రోజునుండి రాత్రి భోజనం చేసిన తర్వాత చేసే కొన్ని పనులు -మంచాలేడం/పక్కలేయడం.. వంటి పనులు, భోజనం చెయ్యక ముందే ముగించుకుని, ఇంత అన్నం పెడితే తినేది లేకపోతే తినకుండానే రాత్రి పూట బడికి పోయే వాడిని. కొన్నిసార్లు ‘వెంకన్న'(వెంకట రెడ్డి) నన్ను రాత్రి బడికి పోవడానికి ప్రోత్సహించేవాడు. ఐతే అది రాత్రి పూట బడి కావడం, అన్ని పనులు ముగించుకోని రోజు 7:30 కూ, నా ప్లేట్ కడుక్కోని భోజనం చేసేందుకు కూర్చూనే వాడిని. ఏమి అనలేక అన్నం పెట్టే వాళ్ళు. అన్నం తిని 7:30 నుండి 8: 00గం. వరకు రాత్రి పూట బడికి పోయే వాడిని.. అలా ఒక మూడు నెలలు పోయాను. ఆ తర్వాత ఏమనుకున్నారో తెలియదు, కానీ ఆ తర్వాత నుండి 7:30 గం: సమయంలో అన్నం పెట్టేందుకు నిరాకరించేవారు. ఐనా సరే, అనేక సార్లు భోజనం చెయ్యకుండానే రాత్రి పూట బడికి పోయే వాడిని. నా ముఖం చూసి అన్నం తినలేదనే విషయాన్ని మా సారు వాళ్ళ అమ్మా అలకోవగా గుర్తుపట్టి, బడయిపోయకా నన్ను పిలిచి అన్నం పెట్టేది.
ఆ విధంగా రాత్రి పూట బడికి పోతుండేవాడిని. ఐతే,నేను అంతకు ముందే చిన్నప్పుడు మూడవ తరగతి వరకు చదివి మానేసిన కాబట్టి బేసిక్స్ త్వరత్వరగా నేర్చుకొనే వాడిని. ఆ విధంగా మూడు నెలల్లో రెండవ తరగతి పుస్తకాలు చదివే యడం జరిగింది. మూడవ తరగతి పుస్తకాలు చదవడం మొదలు పెట్టాము. ఆ సమయంలో బడిని ‘రావు నారాయణ రెడ్డి’ వాళ్ళ తమ్ముడి ఇంట్లోకీ మార్చడం జరిగింది. ఈ ఇల్లు విశాలంగా ఉండేది. ఇంటెనక ఖాళీ స్థలం కూడా విశాలంగా ఉండేది. ప్రతిరోజు ఇంటి ముందు వరండాలో కూర్చొని చదువుకొనే వాళ్ళం.
ఒక రోజు ఏమయిందంటే!? రోజటిలాగానే ఇంటా-బయటా అన్నీ పనులు చేసుకోని, రాత్రి 7:30 లకే, రాత్రి పూట బడికి పోయాను. బాదొల్ల ఈరన్నా, ఇందిరా, అంజయ్య, గద్దొల్ల యాకయ్య, అంజయ్య ,వంగోల్ల శ్రీను.., వీళ్ళతోపాటూ ఊళ్ళో తిండి జీతగాళ్ళ 5గురు, మొత్తం 15-20 మంది కలిసి చదువుకుంటున్నాము. రాత్రి 8:30 గం. అవుతుంది. తెల్లధోతి, తెల్ల కమీజ్ (అంగీ), పెద్ద పలకపాటి ముఖం, పెద్ద పెద్ద ఎర్రటి కళ్ళు, కమ్ము గా ‘సార’ తాగి, కుడిబుజం పైకి-పైకి ఎగరేస్తూ…వీధి దర్వాజ నుండి రాత్రి పూట బడిలోకీ ప్రవేశించి, నోటిలోని చుట్టా తీసి కుడి చేతిలో పట్టుకోని..” ఎవడ్రా!? ఇక్కడా!, మా జీతగానికి చదువు చెప్పేది. చెప్పాలనుకుంటే, వాని తరుపున 6000 రూ.అప్పు కట్టీ , చదువు చెప్పుకో , అంతే గాని, మా పనులు చెడగొట్టి ‘రాత్రి బడి నడపకు. అర్థమయింది అనుకుంటా!” అని బడి నడిపే మెడంను భయపెట్టాడు.
ఆ తర్వాత నన్ను “అరె! రాములుగా!, ఇటు రార!, మూడు రోజులనుండి దున్నపొతు కనబడుతలేదు, ఏమైనట్టురా?, దాని గురించి నీకు ఇంత గూడా బాధా, రంధీ… ఏమైన ఉందార?, హాయిగా తింటున్నవు, మంచిగ రాత్రి పూట బడి పేరుతో ఇక్కడికి వచ్చేస్తున్నావు! ఎవన్నంటే! నేను అన్ని పనులు చేసినంకనే రాత్రి పూట బడికి పోతున్నా,అంటున్నవు!, పని ఉన్నా లేకపోయినా , ఉగాది నుండి మల్ల ఉగాది వరుకు నా ఇంటికాడనే వుండాలె!, ఆ తర్వాత నా పైసలు నాకు పారేసి తర్వాత నువ్వు రాత్రి బడికే పోతవో, పగలు బడికే పోతవో అది నీ ఇష్టం! అంటూ ‘అగ్గిమీద గుగ్గిలం’ అయితున్నాడు. మల్లా మెదటికొచ్చీ ఆ దున్న సంగతేంది !?, అదిగనకా ఇంటికి రాకపోవాలే అప్పుడు నీ సంగతి, నీ రాత్రి పూట బడి సంగతీ, అన్ని చెప్పుత..!, అది రాకపోతే 5000 దండగ కట్టాలె! ” అని తాగున్నమైకంలో, పెద్ద పెద్ద అరుపులతో తిడుతున్నాడు. ఐదు వేల (5000) దండగ కట్టాలె అనేసరికి నాకు కోపమొచ్చింది. ” దున్నపోతు పోతే ఐదు వేల రూపాయల దండగ నేనేందుకు కట్టాలె! అది ఎదకొచ్చిన ‘బర్రె పడ్డా’ తో పోయింది, ఎంత మర్రేసిన రావడం లేదు. దానికి నేనేంచెయ్యను!?,” అని సూటిగా సమాధానం ఇచ్చినందుకు, ‘ఇగో’ హట్టై , కోపంతో రగిలిపోయి, “నాకే ఎదురు చెప్పేంత మొగోనివార!?” , అని ఎడమ చేత్తో నెత్తి మీద జుట్టు పట్టుకుని, కుడిచేత్తో లాగి చెంప్ప పై కొట్టాడు. నా కళ్ళల్లో మిరుగులు దూకినయి. వెంటనే నా కళ్ళు తిరిగి కిందపడి పోయాను. ఈ సంఘటన చూసి మా మేడం వాళ్ళ భర్త, రమెష్ సార్ కూ, ఆపుకోలేనంత కోపమొచ్చింది. ఆయన ముందే ‘కరాటే మాస్టర్’ , ఎవ్వరికీ భయపడే వాడు కాదు. పైగా నేనంటే అతనికి చాలా ప్రేమ అభిమానం. నాకోసం ఎంతవరకైనా తెగించే వ్యక్తిత్వం ఉన్నవాడు.
మా యజమాని ‘బీరం మల్లారెడ్డి’ బడిలోనికొచ్చి తనకిష్టమొచ్చినట్టూ మాట్లాడుతుంటే, ఊరుకోలేకపోయాడు. వాళ్ళ అమ్మ అతన్ని ఇంట్లో కి తీసుకొని పోయి, శాంతింప చేసింది. నేను కళ్ళు తిరిగి కింద పడి పోయింది చూసి తట్టుకోలేకా.. ” మల్లా రెడ్డి ఇది మొదటి సారి, నీకు మర్యాదగ చెప్పుతున్నా విను..!?. మెము ఇక్కడ చదువు చెప్పే వాళ్ళం. మెము ఎవరింటికి పోయి, ఎవ్వరిని బలవంతంగా లాక్కుని రావడం లేదు. ఎవరన్నా ఇష్టపడి చదువుకోవడం కోసం, నా ఇంటికి వస్తే , వాళ్ళకు నేను కచ్చితంగా చదువు చెప్పడం, మా ధర్మం. నీకు నా పరిమిషన్ లేకుండా నా బడిలోకి వచ్చి, నా బడి పిల్లలపై చెయ్యేసుకునే అధికారం నీకు లేదన్న విషయం తెలుసుకో, నీ జీతగాడైతే , ముందుగా నీ ఇంట్లోనే ఆపుకో! గాని మా బడికిలోకీ వచ్చిన తర్వాత అతను మా పిల్లాడు. ఇంకోసారి మా ఇంటికి వచ్చి, ఇలా బాగా తాగి వచ్చి, పిచ్చి పిచ్చిగా చేస్తే ఊరుకునేది లేదు ” అర్థమయిందా.. అని వార్నింగ్ ఇచ్చాడు. ‘బాదోల్ల ఈరన్నా’ లేసి ” రాములు గాడు ఏంతప్పు చేసిండని అంత పెద్ద దెబ్బ కొట్టినట్లు? వాడే మయిన పని చెయ్యక పోతే అడగాలి, రాత్రి పూట ఒక అరగంట సపేకదా బడికి పోయెది!?, వాడెంత మంచోడంటే మాటల్లో చెప్పలేనంత మంచివాడు. మేమందరం పశువులను కాసేకాడ దంటగాళ్ళం. మాకందరికీ చదువు గురించి చెప్పీ, రాత్రి పూట బడికి వచ్చేలా చేసిండు. ఈ ఆరు నెలల్లో రాయడం, చదవడం నేర్చుకున్నం.ఇప్పుడు మా పేర్లు మేమేరాసుకుంటన్నం. బస్సు బోర్డు చదవగల్గుతున్నాం, అంటే ఈ ‘రాములు’ వల్లనే. అటువంటి వాడిని పట్టుకోని నీకిష్టమొచ్చినట్టు కొడితీవి, అంటే నీకెదురు లేదనే కదా!?.” అని తన బాధను వ్యక్తం చేశాడు. ‘గొల్లొల యాకయ’ లేసి” ఇంకోసారి ఈ బడిలోకి వచ్చనావంటే నిమర్యాదుండదు, కావాలంటే నీజీతగాన్ని నీ ఇంటి దగ్గరే ఆపుకో!, కాని ఇక్కడికి వచ్చి నీ ఇష్టం వచ్చినట్లు, మాటలంటా, అంటే ఎవరు ఊరుకోరు!?” అని అన్నాడు. అంతే కాదు,రాత్రి బడికొచ్చిన వాళ్ళందరు నాకు తోడుగా నిలబడ్డారు. ఇదంతా చూసి తాగింది కాస్తా దిగింది. నోరుమూసుకుని ఇంటికి వెళ్ళి పోయాడు మల్లారెడ్డి..!?.
ఆ తర్వాత యదావిధిగా నేను ఇంటికి పోయి పడుకున్న. ఆ మరునాడు యదావిధిగా నా పని నేను చేసుకొంటూ పోయాను. మరుసటి రోజున యదకొచ్చిన బర్రెతో పోయిన దున్నపోతు దానంతట అదే తిరిగి వచ్చింది……
బడిలోకి ప్రవేశించి, పేదలకు, అనాథలకు చదువు చెప్పే సార్లను, పిల్లలను, భయపెట్టిన ‘బీరం మల్లా రెడ్డి’ గారి గురించి పరిచయం చాలా ముఖ్యమైన విషయం.
ఐతే,ఉగాది పండుగ దగ్గిర పడుతున్నా కొద్ది, మా నాన్న గారికీ, దొరగారి అప్పు గురించిన బెంగ రెట్టింపయింది. జీతం సంవత్సరం మద్యలో వదిలేసి వెళ్ళిపోయినప్పటికీ, ఆ అప్పు పైసలు వెంటనే కట్టమని ఇబ్బంది పెట్టలేదు, కాని ఈ ఉగాదికి ఆ అప్పు తీర్చకపోతే మర్యాద దక్కదు అని..!? పైగా దొర , తను తలుచుకుంటే ఏమైన చెయ్యగలడు, అని భావించి, ఊళ్ళో, అడిగీ తెలుసుకోని, బీరం మల్లయ్య(బీరం మల్లారెడ్డి) వద్దా జీతం మాట్లాడి, ఇంటికి వచ్చిన తర్వాత కాస్తా కుదురుగా ఉండడం చూశాను.
బీరం మల్లారెడ్డి గారిది ఓ చిన్నపాటీ భూస్వామి కుటుంబం. అయనకు ఇద్దరు పుతృలు. పెద్ద కొడుకు పేరు ఈరా రెడ్డి(ఈరన్న), చిన్న కొడుకు పేరు వెంకట్ రెడ్డి(వెంకన్న). మల్లారెడ్డి గారి తల్లిగారు ‘సత్యమ్మ’ ఇంట్లో వృద్ధురాలు, ఉండేది. ఈరన్నకూ ఇద్దరు పిల్లలు, అబ్బాయి పేరు ‘వాసు’, అమ్మాయి, పేరు ‘మంజూల’, వీళ్ళు చిన్న పిల్లలు, 3-4 సంవత్సరాలు ఉంటారు. ఇంత చిన్న వయసులో నే వాళ్ళ అమ్మ, వాళ్ళను విడిచి, ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది. ఆ పిల్లలు ఎక్కువ రోజులు వాళ్ళ అమ్మమ్మా ఇంట్లోనే వుండే వాళ్ళు. అప్పుడప్పుడు మాత్రమే వీళ్ళింటి వద్దా ఉండేవాళ్ళు. ఐతే ఈరన్నా సాదాసీదా మనిషే. ఈయన కూడా కష్టపడి పనిచేసే వాడు. ‘వెంకన్న’ ఈరన్న కంటే చాలా చిన్నవాడు. అప్పుడు పదవ తరగతి కష్టంగానే పాసై , హనుమకొండలో ఐటీఐ చేస్తున్నాడనే వాళ్ళు.
ఆ రోజుల్లో నాకు తెలిసినంత వరకు మా ఊళ్ళో,’పటేలు బుచ్చిరెడ్డి దొర’ గారి తర్వాత ఈ బీరం మల్లారెడ్డి గారికీ మాత్రమే ‘ట్రాక్టర్ ‘ ఉండేది. ఈయన ఇల్లు ఊరికి మద్యలో, బొడ్రాయికీ ఓ ఫర్లాంగ్ దూరంలో ఉండేది. ఇంటికి ప్రవేశద్వారం పెద్ద పెద్ద ఇనుప పటాకులతో ఉండేది. లోపల ఇంటికి సమాంతరంగా ఎడ్లకొట్టం ఉండేది. అందులో ఎడ్లు మరియు పాలిచ్చే బర్రె, ఓ కుర్ర దున్న లను అందులో కట్టేసేవాళం.
ఇంటిముందు వీధి(బజార్) ఊరికి మద్యనుండీ పోతూ వాళ్ళ ఇంటిముందునుండీ కుడివైపున మాదిగొల్ల ఇండ్లు దాటీ పోతుంది. అదేవిధంగా వాళ్ళ ఇంటిముందునుండీ ఎడమవైపు ఆంజనేయస్వామి గుడి వరకూ ఉంటుందీ. ఇంటికి ఎదురూగా పశువులకొట్టం, దానికీ చుట్టూరుగా మనిషి నడుముకు పైవరకు ఎత్తుగా, రాళ్ళతో పేర్చిన గోడ ఉండేది. దానికి ఆనుకోని, ఆ రాళ్ళగోడకు అవుతలి పక్కా పెంటకుప్పా ఉండేది. ఆ పెంటకుప్పానానుకోని, పజ్జొన్నచొప్పా, గడ్డివాములు.. ఉండేవి. చిన్నవీ-పెద్దవీ అన్నీ కలిపి ముప్పై (30) పశువులు ఉండేవి.
ముఖ్యంగా నా పని ఈ పశువులను కాయడం, వాటికి మేత వేయడం, వాటిపేడ తీయడం, పశువుల కొట్టం శుభ్రంగా ఉంచడం, పశువులను మేతకు తోలుకొని పోయేటప్పుడు జీతగాళ్ళ సద్దుల గంప్పా నెత్తిన ఎత్తుకోని పోయేవాణ్ణీ. ఆ సద్దులు చింతచెట్లకింది, దొడ్డి కాడా పెట్టీ,
పశువులను తోలుకొని పోయి, చెరువోరకు మేపుకోని వచ్చే వాణ్ణి. ఇవేకాకుండా ఇంట్లో పనులు, మంచినీళ్ళు, ఉప్పు నీళ్లు, వాకిలి, పక్కలేయడం, పక్కలు తీయడం… మొదలగు పనులన్నీ నేనే చేసేవాణ్ణి.
* *
ఐతే,అది 1988-89 వ సంవత్సరం. అప్పుడు భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు రాత్రి పూట ‘బడి’ నడిపే వాళ్ళు. దాని పేరు ‘వయేజనవిద్య’. దేశంలోని యువతి యువకులను, అక్షరాస్యులుగా మార్చడమే దాని ఉద్దేశం. ఐతే,మా ఊళ్ళో, ఈ ‘బడి’లో ‘రాత్రి బడి’ అంటే ‘వయేజనవిద్య’ సెంటర్ ను నడిపే వాళ్ళు. ఐతే ఆవయేజన విద్యాను పర్యవేక్షించేందుకు ఒక సూపర్వైజర్ ‘భారత్ భుషణ్’అనే ఆయన వచ్చేవారు. అప్పుడు మా మెడం, నన్ను అతనితో పరిచీయం చేసింది. ఆయన నన్ను బాగా అభినందించే వారు.
— డా.బోంద్యాలు బానోత్(భరత్)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
నా కథ-4 – రాత్రి బడి — డా.బోంద్యాలు బానోత్(భరత్) — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>