“నీలి గుల్మోహర్ చెట్టు పిల్లలు” (పుస్తక సమీక్ష) -డా.జె.రవీంద్రనాథ్
సహర్ డెలిజార్నీ ఇరాన్ లోని టెహ్రాన్ నగరంలో 1983లో జన్మించారు. ఆమె కుటుంబం తరువాత కాలిఫోర్నియా నగరానికి వలస వెళ్లింది .ఆమె యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా , బర్కిలీ లో చదువుకున్నారు. తన కుటుంబం రాజకీయ కార్యకర్తలుగా, ఖైదీలుగా ఇరాన్ లో ఎదుర్కొన్న అనుభవాల ఉత్తేజంతో తన తొలి నవల “చిల్డ్రన్ ఆఫ్ ది జకరండా ట్రీ ” అనే నవల రచించారు. ఈ ఇరానీ- అమెరికన్ రచయిత్రి రాసిన నవల 32 భాషల్లో ప్రచురితమైంది. ఆమె వ్యాసాలు ‘ది న్యూ యార్క్ టైమ్స్,’ ‘లిటరరీ హబ్,’ ‘బి బి సీ పర్షియన్’ తదితర పత్రికల్లో వచ్చాయి.
డెలిజార్నీ నవల “చిల్డ్రన్ ఆఫ్ ది జకరండా ట్రీ” ( ‘జకరండా’ అంటే తెలుగులో ‘నీలి గుల్మోహర్’) ఇరాన్ లో1983 నుంచి 2010 దాకా సాగిన చరిత్రకు దానిలోని వైరుధ్యాలకు, నిరసనలకు , పర్యవసానాలకు సాహిత్య రూపం. ప్రతిభావంతమైన శైలిలో రచయిత్రి ఇరాన్ లోని సామాన్య పౌరుని స్థితిని చిత్రించారు. మొదట కథలుగా రాద్దామని ఆమె అనుకున్నా అది నవలగా మారింది. జైలు లోనే జన్మించిన ఆమె తన తల్లి దండ్రుల కు న్యాయం చేయాలని భావించి, భిన్న దృక్పథాలు కల పాత్రల ద్వారా నవలా రచన చేశారు.
ఇరాన్ చరిత్రలో షా రెజా పహ్లావికి అమెరికా చాలాకాలం మద్దతు ఇచ్చిన తర్వాత దానికి వ్యతిరేకంగా వెల్లువెత్తిన తిరుగుబాటులో అతడు ఇరాన్ విడిచి పారిపోయాడు. ఈ తిరుగుబాటు ఉద్యమంలో ఉదారవాదులు, మార్క్సిస్టులు, ఇస్లామిక్ మతవాదులు అందరూ ఉన్నారు . కానీ 1979 విప్లవానంతర దశలో అనతి కాలంలోనే దేశ నాయకత్వం ఉదారవాదుల, లౌకికవాదుల నుంచి మతవాదుల చేతుల్లోకి పోయింది. దీనికి తోడు పక్కనున్న ఇరాక్ తో పది ఏళ్లపాటు ఇరాన్ చేసిన యుద్ధంలో అమెరికా ఇరాక్ కి సాయం చేసింది. 1991లో ఇరాక్ కువైట్ ను ఆక్రమించినప్పుడు అమెరికా రంగంలోకి దిగి సద్దాం హుస్సేన్ ఇరాక్ కు వ్యతిరేకంగా యుద్ధం చేసి విఫలం అయింది. మరలా 2003 లో అణ్వస్తాలు తయారీ ఇరాక్ చేసిందనే సాకుతో యుద్ధం చేసి సద్దాం ను ఉరి తీసింది. నేడు కూడా అదే సాకుతో, ఆయిల్ రాజకీయాలతో ఇరాన్ పై అగ్ర రాజ్యం దురాక్రమణ కు దిగింది. మధ్య ప్రాచ్యంలో అమెరికా అనవసర జోక్యం వల్ల, ఆధిపత్య ధోరణి వల్ల, ఇజ్రాయిల్ కు కొమ్ము కాయడం వల్ల ఆ ప్రాంతంలో ఇరాక్, లెబనాన్, పాలస్తీనా, సిరియాలు అంతర్యుద్ధాల్లో మునిగి ఇతర దేశాలకు వలస పెరిగింది. ఆఫ్ఘనిస్తాన్ లో కూడా అమెరికా చలవ వల్లే ఇస్లామిక్ మతోన్మాదం పెరిగి అనర్థం జరిగింది.
ఇరాన్ చరిత్రలో ఇస్లామిక్ మతోన్మాద పాలన పాలనను వ్యతిరేకించిన పలువురు స్త్రీ, పురుషులు చెరసాలల పాలయ్యారు. కొందరు స్త్రీలకు జైలులోనే పిల్లలు జనించారు. వారిని తరువాత వారి కుటుంబాలలోని ఇతరులు పెంచవలసిన దుస్థితి ఏర్పడింది. ఆ పిల్లలు ఎదుర్కొన్న సమస్యలు అదృశ్యమైన బాల్యం,అభద్రతాభావం, ప్రవాసం, వారు పెరిగిన తరువాత కుటుంబ, సామాజిక, మానసిక సర్దుబాటులో వారు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నింటిని డెలిజార్నీ తన నవలలో చిత్రించారు. ఈ నవల చదవడం సున్నితంగా, మధురంగా, ఆహ్లాదకరంగా ఉండదు. దీనికి ఇరాన్ బాధామయ గాథలే కారణం.
ఈ నవలలో అజర్ , ఇస్మాయిల్ దంపతులు తమ నిరసన వల్ల జైలు పాలవుతారు. అలాగే ఇస్మాయిల్ సోదరుడు బెహ్రూజ్ , సిమిన్ మరో జంట, మార్క్సిస్టు అయిన అమీర్ లు సైతం కారాగార కష్టాలు అనుభవిస్తారు.
మామన్ జీనాట్, అఘాజన్ ల సంతానం పారిసా సోదరీమణులు. వీరిలో పారిసా, సిమిన్ లు ఖైదుకాగా , పరిసా పిల్లలు ఓమీద్, సారాలను , సిమిన్ కూతురు ఫోరూగ్ ను కుటుంబంలో చిన్న చెల్లెలు లైలా పెంచాల్సి వస్తుంది. వీరితో పాటు ఇలాగే అనాథ పిల్లలు గా మారిన డాంటే , దాన్యా లు కూడా లైలా దగ్గర నీలి గుల్మోహర్ చెట్టు నీడలో పెరుగుతారు.
1983 లో ఎవిన్ జైలులో అజర్ ,ఇస్మాయిల్ దంపతులు వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న నిరసనకారులు ఉంటారు .తమ కుటుంబాలకు దూరంగా అజ్ఞాత వాసంలో ఉంటారు. వారు కోరిన మార్పు రాలేదని , దాని కోసం చేసిన పోరాట క్రమంలో జైలు పాలు అవుతారు. నిండు గర్భిణిగా ఉన్న అజర్ ను సిస్టర్ (మతరాజ్య వ్యవస్థలో జైలు వార్డెన్ ) ఆసుపత్రికి తీసుకొని వస్తుంది. అజర్ కన్న బిడ్డను కూడా మొదట ఆమెను చూడనివ్వరు. కానీ ఆమె పట్టు బట్టి ఎంతో నీరసంగా ఉన్నా బిడ్డతో సహా ఆసుపత్రి నుంచి తిరిగి జైలుకు వెళుతుంది. మహిళా ఖైదీలు అందరూ ఆ పాపను అపురూపంగా చూసుకుంటారు. మరో వనిత ఫిరూజా జైలు కష్టాలను తట్టుకోలేక అధికారులకు అనుకూలంగా, అజర్ కు శత్రువులా మారుతుంది. కొన్నాళ్ల తర్వాత అజర్ కూతుర్ని అధికారులు ఆమె తల్లిదండ్రులకు అప్పగిస్తారు. తన కూతురు దూరమైన అజర్ కు చనుబాలు ఆగనప్పుడు గతంలో శత్రువులా ఉన్న ఫిరూజా కూడా ఆమెకు దగ్గరై ఆమెను ఓదారుస్తుంది.
నాలుగేళ్ల తర్వాత పరిసా , ఆమె భర్తను రక్షకభటులు తీసుకెళ్తారు. వారి పిల్లలు లైలా పెంపకంలోకి వెళతారు. రోజురోజుకు పెరుగుతున్న నిర్బంధ వాతావరణం పిల్లలకు సైతం అర్థమవుతుంది. లైలా ముసలి తల్లి దండ్రులపై భారం మోపలేక పిల్లల పెంపకం కోసం ఉద్యోగం మానేస్తుంది. ఆ భయంకర వాతావరణంలో నిశ్శబ్దంగా రోజులు గడుస్తుంటాయి. ఎవరు ఫోన్ చేసినా మాట్లాడే పరిస్థితి లేదు. లైలా తను ప్రేమించిన అహ్మద్ కు కూడా పిల్లల కోసం దూరం అవుతుంది. పెరుగుతున్న నిర్బంధ , యుద్ధ వాతావరణం వాతావరణం తట్టుకోలేక జీనత్, ఆగాఖాన్ , లైలా, పిల్లలు అందరూ టెహ్రాన్ నగరం విడిచి వెళతారు.
అదే కాలంలో మార్క్సిస్టు నిరసనకారుడు అమీర్ జైలు పాలై ఎన్నో హింసలు ఎదుర్కొంటాడు. అతని నాస్తికత్వం అధికారులకు గిట్టదు. ఇరాక్ తో యుద్ధం మొదలైనప్పుడు అధికారులు అమీర్, అతని తోటి ఖైదీ బెహ్రౌజ్ (సిమిన్ భర్త) లను వేలాది మంది తో పాటు ఉరి తీస్తారు.
కాలక్రమంలో మామన్ జీనాట్, ఆగా ఖాన్ లు మరణిస్తారు. లైలా సంరక్షణలో ఎందరో అనాథలు పెరుగుతారు. ఫోరూగ్ తల్లి సిమిన్, రెండవ భర్త నాజర్ తో కలిసి జర్మనీ వెళుతుంది . తల్లి దండ్రుల మరణం తర్వాత లైలా ఒంటరి మహిళగా మిగులుతుంది. పిల్లలకు మామన్ జీనాట్ , నీలి గుల్మోహర్ చెట్టు జ్ఞాపకాలు అపురూపంగా ఉంటాయి. పిల్లలకు తమ అసలు తల్లిదండ్రుల గురించి తెలిసినపుడు అప్పటికే పెరిగిన మానసిక దూరం వల్ల ఇబ్బంది పడతారు.
విప్లవానంతరం దాదాపు 20 ఏళ్లలో ఎన్నో మార్పులు జరుగుతాయి. మర్యామ్ తన భర్త అమీర్ మృతి గురించి కూతురు షీదాను ఇటలీలో టురిన్ నగరానికి పంపి చదివిస్తుంది. ఒకరోజు షీదా కు తన పరిశోధనలో తండ్రి అమీర్ గురైన మరణశిక్ష గురించి తెలిసి ఇరాన్ వెళ్లి తల్లి నిజం దాచినందుకు కినుక చూపిస్తుంది. చివరకు తల్లి బాధను గుర్తించి ఇద్దరికి సామరస్యం కుదురుతుంది. ఫిరూజా కూతురు దాన్యా , ఓమీద్ లమధ్య దూరం పెరిగి అమెరికాలో ఉన్న ఓమీద్ కు వివాహం జరిగిందని తెలిసిన దాన్యా విచారగ్రస్తురాలు అవుతుంది.
1979 లో జరిగిన తిరుగుబాటు చరిత్ర దాదాపు ముప్పయి ఏళ్ల తర్వాత పునరావృతమవుతుంది. తల్లిదండ్రుల వారసత్వాన్ని పిల్లలు కొనసాగిస్తారు. కానీ రాజ్య వ్యవస్థ బల ప్రయోగంలో మార్పు రాదు. ఇటలీ లోని టురిన్ నగరంలో పెరిగిన నెదా గతంలో జైలు వార్డెన్ గా పనిచేసిన మేశామ్ తనయుడు, రాజకీయ శరణార్థీ అయిన రెజాకు దగ్గరవుతుంది. అయితే తన తండ్రి మరణం గురించి నిజం తెలిసిన తర్వాత ఆమెకు ,అతడికి మధ్య దూరం. కానీ రెజా తండ్రి తర్వాత నిరసనకారుడిగా మారాడని తెలుసుకున్న నెదా మనసు మారుతుంది. ఏదో ఒకనాడు అతడికి ఇరాన్ కు వెళ్ళి నీలి గుల్మోహర్ చెట్టును చూపిస్తానని అంటుంది.
ఒక దేశంలో అస్తవ్యస్త పరిస్థితులు, నియంతృత్వం వల్ల ప్రజలకు భౌతికంగా , మానసికంగా బాధలు, వలసలు అనివార్యమవుతాయి. నూతన వాతావరణం లో ఇమడటం పిల్లలకు పెద్ద సమస్య. తల్లిదండ్రులు ఎవరు అనేది, వారి చరిత్ర పిల్లలకు తెలియక పోవడం, జైలులో పెరగటం మూలంగా ఇబ్బందులు, మత నిరంకుశత్వ నీడలో భయానక వాతావరణం అన్నింటిని ఈ నవల చిత్రించింది. పెరిగిన పిల్లలు ఎదిగిన తరువాత తమ గత జ్ఞాపకాలతో, వర్తమానంతో సర్దుబాటు చేసుకుని భవిష్యత్తు వైపు ఆశగా చూస్తారు. వారిలో సమస్యలను ఎదుర్కొనే ధైర్యం పెరిగి జీవనోల్లాసం కలుగుతుంది.
రచయిత్రి తాను కేవలం జైలు అనుభవాలే కాక కుటుంబాలు, స్నేహితులు, పిల్లలు, జ్ఞాపకాలు గురించి రాశానని, చివరగా వర్తమానం, భావి అనేవి గతం లేకుండా ఉండవు. యుద్ధం సిరియా, అర్జెంటీనా, బర్మా , ఇరాన్ ఎక్కడ జరిగినా జనానికి స్వేచ్ఛ కావాలి.అందరి బాధ ఒకటే. అంతరంగం అట్టడుగున అందరూ మానవులే సందేశం నవలలో ఉందని ఇంటర్వ్యూలలో తెలిపారు. దేశము యొక్క అసలు దుస్థితి మతోన్మాదం చేసే హింస ,అది పోగానే ఇజ్రాయిల్ -అమెరికా బాంబుల దాడిలో జరిగే హింస అని చెప్పారు. ఇరాన్ ప్రాచీన నాగరికత, పట్టుదల, పర్షియన్ పరాక్రమం అగ్ర రాజ్య ఆధిపత్య ధోరణిని సహించవు.
-డా.జె.రవీంద్రనాథ్
విశ్రాంత ఆంగ్ల ఆచార్యులు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
“నీలి గుల్మోహర్ చెట్టు పిల్లలు” (పుస్తక సమీక్ష) -డా.జె.రవీంద్రనాథ్ — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>